Janasena: రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు: పవన్ కల్యాణ్ ఆవేదన
![pawan kalyan condolences to farmers suicides](https://imgb.ap7am.com/thumbnail/cr-20220429tn626c0d224db33.jpg)
- మూడు జిల్లాల్లో ముగ్గురు రైతుల బలవన్మరణం
- బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
- రైతుల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న జనసేనాని
ఏపీలో రైతుల అవస్థలపై జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం రాదా? అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వ్యవసాయ రంగం మీద, రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదని పవన్ ఆక్షేపించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా రైతులు, కౌలు రైతులు సాగులో వచ్చిన నష్టాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవన్ పేర్కొన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచి వారి కష్టాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. శుక్రవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న పవన్... వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.