కాంగ్రెస్ నాయకత్వంపై పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు: చిదంబరం స్పష్టీకరణ

కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఆయన నుంచి అలాంటి ప్రతిపాదనేం రాలేదని చెప్పుకొచ్చారు. పీకే తన ప్రజెంటేషన్‌లో ఇలాంటి ప్రస్తావనేదీ తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా ప్రియాంక పేరును ప్రస్తావించినట్టు కూడా తాను వినలేదన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ విషయాలను పేర్కొన్నారు.

నాయకత్వ సమస్య అనేది పార్టీ అంతర్గత విషయమని, దానిని ఏఐసీసీ చూసుకుంటుందని చిదంబరం అన్నారు. ఆగస్టు నాటికి ఎన్నికలతో ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. పార్టీ ప్రతిపాదనను పీకే నిరాకరించిన విషయమై ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించి పీకే నుంచి మళ్లీ ఎలాంటి వివరణ కోరలేదన్నారు. 

పీకే బహుశా రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలని అనుకుంటున్నారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌తో పీకే చేసుకున్న ఒప్పందం కారణంగానే కాంగ్రెస్‌లో చేరేందుకు పీకే నిరాకరించారన్న వార్తల్లో నిజం లేదని చిదంబరం కొట్టిపడేశారు. కాగా, పీకే చేసిన ప్రతిపాదనల్లో కొన్ని ఆచరణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Chidambaram
Prashant Kishor
Congress
TRS
Priyanka Gandhi

More Telugu News