Atchannaidu: తాడేపల్లి కశ్మీర్ బోర్డర్ ను తలపిస్తోంది: అచ్చెన్నాయుడు

  • ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే అరెస్టులు చేస్తున్నారన్న అచ్చెన్న 
  • వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చిటికెలేసి చెప్పారని ఎద్దేవా 
  • హామీని జగన్ మర్చిపోయినా.. ఉద్యోగులు మర్చిపోలేదని వ్యాఖ్య 
Tadepalli is looking like Kashmir border says Atchannaidu

సీపీఎస్ ను రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన జగన్ దాన్ని నిలుపుకోలేకపోయారంటూ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఛలో సీఎంఓ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడిక్కడే అడ్డుకుంటున్నారు. మరోవైపు తాడేపల్లిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్రాంతమంతటినీ ముళ్ల కంచెలతో నింపేశారని... ఆ ప్రాంతం కశ్మీర్ బోర్డర్ ను తలపిస్తోందని విమర్శించారు. 


వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చిటికెలేసి జగన్ చెప్పారని అచ్చెన్న అన్నారు. ఇచ్చిన హామీని ఆయన మర్చిపోయినా... ఉద్యోగులు మాత్రం మర్చిపోలేదని చెప్పారు. జగన్ మోసాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News