Andhra Pradesh: అమరావతిలో మళ్లీ ప్రారంభమైన పనులు.. కార్మికులకు గులాబీల స్వాగతం

  • ఆగిపోయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల్లో ప్రారంభమైన పనులు
  • గతంలో నిర్మించిన ఎన్‌సీసీకే మళ్లీ పనుల అప్పగింత
  • హర్షం వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు
  • హైకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందంటున్న రైతులు
construction works started again in amaravati

అమరావతిలో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇది చూసిన రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేందుకు వచ్చిన కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన తమకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించాలని కోరుతున్నారు. 

రాయపూడిలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహాలను నిర్మించగా, ప్రభుత్వం మారాక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే, ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజధానిలో మళ్లీ పనులు ప్రారంభం కావడంతో ఆ ప్రాంతంలో మళ్లీ సందడి నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఇందులో భాగంగా గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్‌సీసీ సంస్థకే తిరిగి పనులు అప్పగించారు. దీంతో రాయపూడి చేరుకున్న కార్మికులు టైల్స్, నీటి పైపులు, విద్యుత్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ సామగ్రి ఇప్పటికే రాయపూడి చేరుకుంది. సోమవారం నుంచి మరింతమంది కార్మికులు రాయపూడి చేరుకుంటారని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.

More Telugu News