ఉక్రెయిన్, జహంగీర్‌పురిపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త: న్యూస్ చానళ్లకు కేంద్రం హెచ్చరిక

No scandalous headlinesOn Ukraine and Jahangirpuri coverage
  • శీర్షికలు, ట్యాగ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఐ అండ్ బీ
  • చట్టాలకు కట్టుబడి ఉండేలా వార్తలు ప్రసారం చేయాలని సూచన
  • జహంగీర్‌పురి హింసపై చర్చలు అన్‌పార్లమెంటరీగా ఉంటున్నాయని ఆగ్రహం
జహంగీర్‌పురి హింస, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వార్తా చానళ్లకు సూచించింది. సంబంధిత చట్టాలకు అనుగుణంగా వాటి హెడ్‌లైన్స్ ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది. 

ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రసారం చేసేటప్పుడు వాటి శీర్షికలు, ట్యాగ్‌లైన్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వాయవ్య ఢిల్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి టీవీ చానళ్లలో చర్చలు అమర్యాదకరంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాషను ఉపయోగించారని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది. 

అంతేకాదు, జహంగీర్‌పురి హింసాత్మక ఘటన విచారణకు మీడియా కవరేజీ ఆటంకం కలిగిస్తోందని కూడా పేర్కొంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా జహంగీర్‌పురిలో రాళ్లు రువ్వినట్టు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. 

పై ఘటనలకు సంబంధించి కంటెంట్‌ను ప్రసారం చేసే పద్ధతిలో టీవీ చానళ్లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మంత్రిత్వశాఖ జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. 

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం నుండి తక్షణమే దూరంగా ఉండాలని అందులో హెచ్చరించింది. కాగా, జహంగీర్‌పురి హింసకు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ దర్యాప్తు చేస్తోంది.
Go Back to Shorts
TV Channels
Ukraine
Jahangirpuri
I&B

More Telugu News