Chiranjeevi: 'ఆచార్య'కి సంబంధించి నాన్నతో గడిపిన ఆ 18 రోజులు మరిచిపోలేనివి: రామ్ చరణ్

  • 18 రోజుల పాటు ఒకే కాటేజ్ లో ఉన్నామన్న చరణ్  
  • ఆ రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయని వెల్లడి 
  • అవి తన జీవితాంతం గుర్తుండిపోతాయన్న చరణ్   
Acharya movie update

చిరంజీవి - చరణ్ కాంబినేషన్లో కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందించారు. నిరంజన్, అవినాశ్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు. 

"ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనుల కారణంగా నాలుగేళ్లుగా నాన్నతో కలిసి ఉండలేకపోయాను. నాన్నకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మేమిద్దరం కలిసి 'ఆచార్య' సినిమాకి కలిసి పనిచేయవలసి వచ్చింది. ఈ సినిమా కోసం ఇద్దరం కలిసి 18 రోజుల పాటు ఒకే కాటేజ్ లో ఉన్నాము.

 అడవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు కలిసి కాటేజ్ లో ఉండవలసి వచ్చింది. ప్రతి రోజు ఇద్దరం కలిసి వర్కౌట్స్ చేసేవాళ్లం .. కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేవాళ్లం. సాయంత్రం షూటింగు నుంచి వచ్చిన తరువాత టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా నాన్నతో గడిపిన ఆ 18 రోజులు .. నా జీవితంలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News