మసీదులపై లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకోండి.. మహారాష్ట్ర ముస్లిం సంఘం సలహా
- ఎక్కువ శాతం మసీదులు అనుమతి తీసుకున్నాయి
- మిగిలినవి కూడా అదే పనిచేయాలి
- అందరికీ న్యాయం చేసేందుకు మహా సర్కారు కృషి
- జమాయిత్ ఉలేమా కార్యదర్శి ప్రకటన
తాజా పరిణామాల నేపథ్యంలో జమాయిత్ ఉలేమా హింద్ మహారాష్ట్ర కార్యదర్శి గుల్జార్ అజ్మి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని చాలా మసీదులు లౌడ్ స్పీకర్లను పెట్టుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాయి. ఇప్పటికీ అనుమతి తీసుకోని మసీదులు వుంటే వెంటనే ఆ పని చేయాలని కోరుతున్నాం’’ అని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు ఎంతో సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర సర్కారు ఈ విషయంలో అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
మసీదులపై మే 3 నాటికి లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే అల్టిమేటం ఇవ్వడం తెలిసిందే. లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణం వినిపిస్తామని ప్రకటించారు.