Golla Babu Rao: మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్ఠానం అన్యాయం చేసింది: వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

  • తానేమీ అమాయకుడిని కాదన్న బాబూరావు 
  • అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని హెచ్చరిక 
  • పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తే అన్యాయం చేశారని వ్యాఖ్య 
I am Not An Innocent YCP MLA Golla Babu Rao Sensational Comments

మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్ఠానం తనకు అన్యాయం చేసిందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోటవురట్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిన్న జరిగిన వలంటీర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 

ముఖ్యమంత్రి నుంచి తనకు ఇప్పటి వరకు కబురు రాలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు నియోజకవర్గం నుంచి 60-70 కార్లలో కార్యకర్తలు అమరావతి వెళ్లి సజ్జలను కలిసినట్టు చెప్పారు. అయినా, బోడి రాజకీయాలు తనకెందుకని అన్నారు. 

వైఎస్సార్ మరణం తర్వాత తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. తానేమీ అమాయకుడిని కాదని, నూటికి లక్షశాతం హింసావాదినని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనను దెబ్బకొట్టిందని, అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బకొడతానని హెచ్చరించారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, అయినా తనకు అన్యాయం చేశారని బాబూరావు వాపోయారు.

More Telugu News