Taliban: ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ వైమానిక దాడులు... తీవ్ర హెచ్చరికలు చేసిన తాలిబన్లు

  • ఈ నెల 16న ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో పాక్ దాడులు
  • 40 మంది ఆఫ్ఘన్ పౌరుల మృతి
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న తాలిబన్లు
Taliban warns Pakistan

తమ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులు చేపట్టడాన్ని తాలిబన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్ లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించాయి. ఈ పరిణామంతో తాలిబన్ పాలకులు మండిపడ్డారు. 

భవిష్యత్తులోనూ పాక్ ఇదే తీరులో దాడులకు తెగబడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హెచ్చరించారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ లో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని ముజాహిద్ తెలిపారు. పదేపదే తప్పిదాలకు పాల్పడుతూ ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని ఉద్ఘాటించారు. 

అటు, ఐక్యరాజ్యసమితిలో ఆఫ్ఘన్ రాయబారి కూడా ఈ దాడులపై స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమత్వం పట్ల పాక్ దురుసు వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఐక్యరాజ్యసమితి నియమావళిని కూడా పాటించడంలేదని ఆరోపించారు.

More Telugu News