Satinder Sartaj: భారతీయ గాయకుడితో కచేరీ ఏర్పాటు చేసిన పాకిస్థాన్ సంతతి వ్యక్తి... చివరి నిమిషంలో కార్యక్రమం రద్దు... ఎందుకంటే...!

  • ఏప్రిల్ 17న అమెరికాలో సతీందర్ సర్తాజ్  కచేరీ
  • హూస్టన్ వేదికగా కార్యక్రమం ఏర్పాటు చేసిన సిద్ధిఖీ
  • సిద్ధిఖీ పాకిస్థాన్ సంతతి వ్యక్తి, ఐఎస్ఐ ఏజెంట్ అన్న ఆరోపణలు 
  • కేంద్రానికి లేఖ రాసిన రాజ్యసభ సభ్యుడు కేఎల్ మీనా
Satinder Sartaj concert in Houston called off

అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారతీయ గాయకుడు సతీందర్ సర్తాజ్ తో పాకిస్థాన్ సంతతికి చెందిన రెహాన్ సిద్ధిఖి ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమం హూస్టన్ లో ఈ నెల 17న జరగాల్సి ఉంది. అయితే, రాజ్యసభ సభ్యుడు కేఎల్ మీనా కేంద్రానికి లేఖ రాయడంతో ఆ కచేరీ నిలిచిపోయింది. 

కచేరీ నిర్వాహకుడు రెహాన్ సిద్ధిఖీపై పాకిస్థాన్ గూడఛార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అన్న ఆరోపణలు ఉన్నాయని కేఎల్ మీనా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. హూస్టన్ లోని భారత కాన్సులేట్ జనరల్ సిఫారసుల మేరకు 2020లో రెహాన్ సిద్ధిఖీని బ్లాక్ లిస్టులో చేర్చారని కూడా మీనా తన లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో, కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ కచేరీ ద్వారా రెహాన్ సిద్ధిఖీ సేకరించే నిధులను భారత వ్యతిరేక కార్యకలాపాల కోసమే వినియోగిస్తాడని కూడా ఆరోపించారు. ముఖ్యంగా, కశ్మీర్ వ్యతిరేక చర్యలకు అతడు ప్రోత్సాహం అందించే అవకాశాలున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో, హూస్టన్ లో నిర్వహించతలపెట్టిన కచేరీ ఆగిపోయింది. అంతేకాదు, కచేరీకి సంబంధించిన వెబ్ సైట్లోనూ ఆ కార్యక్రమ వివరాలను తొలగించారు.

More Telugu News