IMD: ఈసారి రుతుపవనాల సీజన్ లో సాధారణ  రీతిలోనే వర్షపాతం: ఐఎండీ అంచనా

  • రైతులకు ఐఎండీ తీపి కబురు
  • మరికొన్ని వారాల్లో రుతుపవనాల సీజన్
  • దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు
  • వ్యవసాయానికి ఇబ్బంది ఉండదన్న ఐఎండీ
IMD predictions on monsoon season

మరికొన్ని వారాల్లో భారత్ లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాలు వెల్లడించింది. 2022లో సాధారణ రీతిలోనే వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. 

దీర్ఘకాల సగటు (ఎల్పీయే) పరంగా చూస్తే దేశంలో నైరుతి రుతుపవనాలు 99 శాతం వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో ఈశాన్య భారతం, వాయవ్య భారతంలోని పలు ప్రాంతాలు, పలు దక్షిణాది భాగాల్లో సాధారణం కంటే తక్కువస్థాయిలో వర్షపాతం నమోదవుతుందని వివరించింది. అయితే, వర్షాధార వ్యవసాయ కార్యకలాపాలపై ఇదేమంత ప్రభావం చూపబోదని, దేశంలోని ప్రాంతాల్లో సాధారణం, అంతకుమించి వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. 

1987 నుంచి 2020 మధ్య కాలంలో దీర్ఘకాల సగటు 87 శాతం కాగా, 96 నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే రుతుపవనాల సీజన్ లో సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి సాధారణ వర్షపాతానికి 40 శాతం అవకాశాలు ఉన్నాయని, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 15 శాతం, అత్యధిక వర్షపాతానికి 5 శాతం అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. తద్వారా విస్తారంగా వర్షాలు కురిసేందుకు 60 శాతం అవకాశం ఉందని అంచనా వేసింది.

More Telugu News