742 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో మళ్లీ భౌతిక విచారణలు

  •  2020 మార్చి 23 నుంచి నిలిచిన భౌతిక విచారణలు
  • కరోనా తగ్గడంతో తాజాగా నిర్ణయం 
  • ఏప్రిల్ 4 నుంచి భౌతిక విచారణలు 
కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత నుంచి సుప్రీం కోర్టులో భౌతిక విచారణలకు తెరపడింది. వర్చువల్ గానే విచారణలు నడుస్తున్నాయి. వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఏప్రిల్ 4 నుంచి పూర్వపు విధానంలో ముఖాముఖి విచారణలు ప్రారంభం కానున్నాయి. 

మొత్తం మీద 742 రోజుల పాటు కొనసాగిన ఆన్ లైన్ విచారణలకు ముగింపు పడనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్వయంగా దీనిపై ప్రకటన చేశారు. ‘‘వచ్చే సోమవారం నుంచి పూర్తి స్థాయి భౌతిక విచారణలు మొదలవుతాయి’’ అని ప్రకటించారు. 2020 మార్చి 23 నుంచి సుప్రీం కోర్టులో భౌతిక విచారణలు నిలిచిపోయాయి. 

తిరిగి వీటిని ప్రారంభించాలని చీఫ్ జస్టిస్ రమణతోపాటు, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ ఎన్ రావు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా తగ్గిపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. భౌతిక విచారణల కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.

Supreme Court
hearing
physical

More Telugu News