చికెన్ వండనన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

  • మద్యం తాగి చికెన్ తెచ్చి వండమన్న భర్త
  • అమ్మవారు సోకిన కుమార్తె ఉండడంతో వండనన్న భార్య
  • తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి యాసిడ్ తాగిన వైనం
  • చికిత్స పొందుతూ మృతి
అమ్మవారు (చికెన్ పాక్స్) సోకిన కుమార్తె ఇంట్లో ఉండడంతో చికెన్ కూర వండనన్న భార్య మీద కోపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంటతండాకు చెందిన రతన్‌లాల్ (32) ఆటో డ్రైవర్. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం భార్య రాధిక, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి హైదరాబాద్ వచ్చి దుండిగల్‌లో ఉంటున్నాడు. 

ఈ నెల 25న సాయంత్రం మద్యం తాగి కోడి మాంసం తీసుకుని ఇంటికెళ్లి భార్యకిచ్చి వండమని చెప్పాడు.  అయితే, కుమార్తెకు ఆటలమ్మ సోకడంతో ఇంట్లో చికెన్ వండకూడదని భర్తకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అయితే, ఆ తర్వాతి రోజు తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. ఆపై యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Dundigal
Chicken

More Telugu News