India: ప్రధాని మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ ఫోన్

  • పుతిన్ చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు అన్న బోరిస్
  • ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితులపై చర్చ
  • త్వరలోనే ఇరు దేశాల నేతల ప్రత్యక్ష సమావేశం
Britain Prime Minister Calls PM Modi

ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేసి మాట్లాడారు. పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని అన్నారు. ఉక్రెయిన్ లో ఉన్న తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురంచి ఆయన సుదీర్ఘంగా ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

ఉక్రెయిన్ సమగ్రత, సార్వభౌమత్వాన్ని అందరూ కచ్చితంగా గౌరవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఇద్దరు నేతలూ అంగీకరించినట్టు తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు రష్యా లోబడి ఉండాల్సిందేనని ఇరు నేతలు చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లాలంటే అంతర్జాతీయ చట్టాలను అందరూ ఆచరించాలని మోదీ, బోరిస్ లు అభిప్రాయపడ్డారు. మానవ సంక్షోభం దృష్ట్యా ఉక్రెయిన్ కు అండగా ఉంటామంటూ ప్రధాని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. 

కాగా, వాణిజ్యం, భద్రత, వ్యాపార రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు రెండు దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని, వీలైనంత త్వరగా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

More Telugu News