ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ నేతలవే: సోమిరెడ్డి

  • ఊరూపేరూ లేని మద్యాన్ని జగన్ విక్రయిస్తున్నారు
  • బ్రాండ్ల తయారీలో కనీస నాణ్యత కూడా ఉండటం లేదు
  • ప్రతి ఏటా రూ. 5 వేల కోట్లను దోచుకుంటున్నారు
డబ్బులు దోచుకోవడం కోసమే ముఖ్యమంత్రి జగన్ ఊరూపేరూ లేని కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కల్తీ సారాను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు. జనాలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని... తనకు రావాల్సిన సొమ్ము వస్తే చాలనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రతి ఏటా రూ. 5 వేల కోట్లను దండుకుంటున్నారని ఆరోపించారు. 

ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ మంత్రులు, ఎంపీలు, నేతలవేనని సోమిరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలో 28 మంది ప్రాణాలు కోల్పోక ముందే అక్కడున్న నాటుసారా నిల్వలను నాశనం చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ వినని మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నారని... ఆ బ్రాండ్ల తయారీలో కనీస నాణ్యత కూడా పాటించడం లేదని విమర్శించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Jagan
YSRCP
Liquor

More Telugu News