మాది మతపిచ్చి పార్టీ అనేవాళ్లు గోవాలో బీజేపీ హ్యాట్రిక్ ను చూడాలి: కిషన్ రెడ్డి

  • గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ
  • మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం
  • మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట హ్యాట్రిక్ అన్న మంత్రి 
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర టూరిజం శాఖ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమది మత పిచ్చి పార్టీ అని ప్రచారం చేసేవాళ్లు గోవాలో తమ హ్యాట్రిక్ విజయాన్ని చూడాలని అన్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న గోవాలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. గోవాలో తాము ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా సంప్రదించామని, ఆ స్వతంత్ర అభ్యర్థితో కలిపి తమకు 21 సీట్లు ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ అద్భుతమైన రీతిలో ఫలితాలు సాధించిందని, యూపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా రెండుసార్లు ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అరుదైన విషయమని, అలాంటిది యూపీలోనూ, ఉత్తరాఖండ్ లోనూ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ లో కొన్ని కారణాల రీత్యా ముఖ్యమంత్రులు మారినప్పటికీ ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని కిషన్ రెడ్డి వివరించారు. మణిపూర్ లోనూ తమదే హవా అని స్పష్టం చేశారు.

Kishan Reddy
Goa
BJP
Assembly Elections
Uttar Pradesh
Uttarakhand
Manipur

More Telugu News