కాంగ్రెస్పై బీజేపీ సీఎం అదిరేటి సెటైర్లు
- గోవాలో మొదలైన రిసార్టు పాలిటిక్స్
- ప్రత్యేక శిబిరాలకు కాంగ్రెస్ అభ్యర్థులు
- కాంగ్రెస్ పార్టీపై గోవా సీఎం సెటైర్లు
రెండు రోజుల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక అడుగు వేసింది. గోవాలో బీజేపీకే ఆధిక్యం అని సర్వేలు చెబుతున్నా.. తన సర్వేలో ఏమని తేలిందో గానీ..తన పార్టీ టికెట్ల మీద బరిలో నిలిచిన అభ్యర్థులను రిసార్టులకు తరలించింది. వెరసి రిసార్టు రాజకీయాలకు తెర తీసింది. దీనిపై గోవా సీఎం, బీజేపీ యువనేత ప్రమోద్ సావంత్ సెటైర్లు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థులను కూడా నమ్మలేకపోతోందని సావంత్ వ్యాఖ్యానించారు. తన గుర్తుపై బరిలో నిలిచిన తన అభ్యర్థులే ఇతర పార్టీల వైపు పరుగులు పెడతారని కాంగ్రెస్ భయపడిపోతోందని, అందుకే రిసార్ట్ రాజకీయాలు మొదలెట్టేసిందని ఆయన అన్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భయంతోనే సాగుతుందని తాను విన్న మాట నిజమైందని కూడా ఆయన చెప్పారు. మంగళవారం నాడు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సందర్భంగా సావంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.