చైనా కంపెనీ హువావే కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

Huaweis offices searched by taxmen
  • ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు కార్యాలయాల్లో సోదాలు  
  • పలు పత్రాల స్వాధీనం
  • పన్ను ఎగవేతను గుర్తించే ప్రయత్నం
  • ఇటీవలే ఇతర చైనా కంపెనీల్లోనూ ఇదే మాదిరి సోదాలు
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ హువావే భారత్ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలకు దిగారు. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్టు సమాచారం. ఆదాయపన్ను ఎగవేతలను గుర్తించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.

ఇదేమాదిరి సోదాలు చైనాకు చెందిన జెడ్ టీఈ భారత కార్యాలయాల్లో కొన్ని నెలల క్రితం జరగడం గమనార్హం. సోదాల సందర్భంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. చైనాకు చెందిన ఒప్పో, షావోమీ కంపెనీల్లోనూ ఐటీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. విక్రయాలకు సంబంధించి విలువను తక్కువ చేసి చూపించారంటూ, ఎగవేసిన పన్నును చెల్లించాలంటూ షావోమీకి నోటీసులు జారీ చేయడం తెలిసిందే.

ఐటీ సోదాలపై హువావే స్పందించింది. భారత్ లో తమ కార్యకలాపాలు స్థానిక చట్టాలకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా హువావేను 5జీ పరీక్షల్లో పాల్గొనకుండా కేంద్రం దూరం పెట్టడం తెలిసిందే.
Go Back to Shorts
Huawei
taxmen
searches

More Telugu News