ఏపీకి సూడో విద్యుత్ మంత్రిగా షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోంది: సోమిరెడ్డి విమర్శలు

Somireddy slams AP Govt
  • ఇంధన శాఖ కార్యదర్శిపై సోమిరెడ్డి ఫైర్
  • విద్యుత్ శాఖ పనులు షిరిడీసాయి సంస్థకు అప్పగించారని ఆరోపణ
  • ప్రభుత్వానిది చేతకానితనం అంటూ వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీకి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓ కడప రెడ్డికి చెందిన సంస్థ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ అని వెల్లడించారు. సీఎం చెప్పారంటూ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆ సంస్థకు విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ అప్పగించారని ఆరోపించారు.

ఢిల్లీలో ఉన్నత పదవి కోసం ఏది కావాలంటే అది చేస్తావా శ్రీకాంత్? అని ప్రశ్నించారు. "నువ్వో ఐఏఎస్ అధికారివి... ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్నవాడివి... ఓ రోల్ మోడల్ గా ఉండాల్సిన వాడివి.. షిరిడీసాయి యాజమాన్యానికి దాసోహం అంటావా?" అంటూ మండిపడ్డారు.

"అన్ని విషయాలు షిరిడీసాయి వాళ్లే చూసుకుంటారని సీఎం చెబితే పనులన్నీ షిరిడీసాయి సంస్థకు అప్పగిస్తారా? థర్మల్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చినా మీకు పట్టింపు లేదా? రూ.700 కోట్ల మేర మట్టితో కలిసిన బొగ్గు తెస్తే మెమోలు ఇచ్చి సరిపెట్టారు. కనీసం ఆ కంపెనీని బ్లాక్ లిస్టులోనైనా పెట్టారా?" అని నిలదీశారు.

షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పరికరాలను అధిక ధరలతో  విద్యుత్ శాఖకు సరఫరా చేస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం షిరిడీసాయి సంస్థ ప్రభావ ఫలితమేనని సోమిరెడ్డి వివరించారు. విద్యుత్ శాఖలో నష్టాలకు ప్రభుత్వ చేతకానితనమే కారణమని విమర్శించారు.

కృష్ణపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. విద్యుత్ ప్లాంట్ ను లీజుకివ్వడాన్ని నిరసిస్తూ పోరాటానికి సిద్ధమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. భూములిచ్చిన నిర్వాసితుల ప్రయోజనాలు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Somireddy Chandra Mohan Reddy
Shiridisai Electricals
Electricity Ministry
Andhra Pradesh

More Telugu News