మిత్ర దేశాన్నీ వదలని చైనా.. నేపాల్ లోనూ ఆక్రమణలు

China Encroaches Into Nepal
  • సరిహద్దులు దాటేసి వచ్చిన చైనా
  • హమ్లా జిల్లాలో ఆక్రమణలు
  • నేపాల్ భూభాగంలో ఇనుప కంచెలు
ఓ పక్క భారత్ లోకి చొచ్చుకొస్తూ.. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ.. మిత్ర దేశం అని చెప్పుకొనే నేపాల్ నూ వదలడం లేదు. నేపాల్ లోనూ చైనా ఆక్రమణలకు పాల్పడుతూ విస్తరణవాదానికి ప్రేరేపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల వద్ద నేపాల్ లోని హమ్లా జిల్లాలోకి చొచ్చుకొచ్చేసింది. చైనా ఆక్రమణలకు పాల్పడిందని గత ఏడాది సెప్టెంబర్ లో ఆరోపణలు రావడంతో.. ఆ విషయాన్ని తేల్చాలంటూ ఆ దేశ హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

తాజాగా ఆ కమిటీ రిపోర్టును ఇచ్చింది. సరిహద్దుల వద్ద కమిటీ అధ్యయనం చేసింది. ప్రత్యేకించి లిమి లోయలో పరిస్థితులను అంచనా వేసింది. చైనా ఆక్రమణలకు పాల్పడిందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే నేపాల్ హిందూ సివిక్ సొసైటీ, రాష్ట్రీయ ఏకతా అభియాన్ ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి మెమొరాండం సమర్పించారు. చైనా ఆక్రమణలపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని కోరారు.

1963 సరిహద్దు ప్రొటోకాల్ ప్రకారం  పిల్లర్ 5 (2), కిట్ ఖోలా మధ్య రెండు దేశాల మధ్య నిర్ణయించిన సరిహద్దులను దాటి చైనా ముందుకొచ్చినట్టు ప్రభుత్వ అధ్యయనం తేల్చిందని గుర్తు చేశారు. నేపాల్ భూభాగంలో చైనా ఇనుప కంచెలను ఏర్పాటు చేసిందన్నారు. కాగా, కమిటీ ఇచ్చిన నివేదికను నేపాల్ విదేశాంగ శాఖ పరిశీలిస్తోంది. 
Go Back to Shorts
China
Nepal
Encroachments

More Telugu News