వీళ్లకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదు... నాడు గవర్నర్ ను, నేడు రాష్ట్రపతిని అవమానించారు: బండి సంజయ్
- నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
- రాష్ట్రపతి ప్రారంభ ప్రసంగం
- బాయ్ కాట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు
- తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
గవర్నర్ ప్రసంగంలో తమ సంవత్సరకాలపు అభివృద్ధి గురించి చెబుతారా? లేక ప్రతి పక్షాల గురించి చెబుతారా? అని అధికార టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఈ కనీసజ్ఞానం లేని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ వారి ఎంపీలను ఆదేశించడం నియంతృత్వ ఆలోచనలకు నిదర్శనం అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు కలిగే కొత్త ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని బండి సంజయ్ హితవు పలికారు.
ఇవాళ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రధాని మోదీ నాయకత్వంలో గత సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ విజయాలను స్పష్టంగా వివరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.