మంత్రి పదవి నుంచి నన్ను తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం: మంత్రి కొడాలి నాని

Kodali Nani furious on TDP leaders
గుడివాడలో కేసినో ఏర్పాటు చేశారంటూ తనపై టీడీపీ చేస్తున్న పోరాటం, తాజా పరిణామాలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని వ్యాఖ్యానించారు.

టీడీపీతో పాటు మీడియాలో ఓ వర్గం కేవలం తనపైనే దృష్టి పెట్టినట్టు ఆరోపించారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నమని అన్నారు. గుడివాడలోని తన 'కే కన్వెన్షన్'లో కేసినో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అది నిజమని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరితే, కే కన్వెన్షన్ సమీపంలో జరిగిందంటూ టీడీపీ 420 గాళ్లు మాటమార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కే కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని అని కాకుండా, గుడివాడలో జరిగిందంటున్నారని విమర్శించారు. తాను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉంటే తనపై ఇష్టంవచ్చిన రీతిలో రాద్ధాంతం చేశారని ఆరోపించారు. కరోనా వచ్చి చికిత్స పొందుతున్న తనను టార్గెట్ చేశారని వివరించారు.

ఈ సందర్భంగా టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో ఉన్న సభ్యులను కూడా కొడాలి నాని విమర్శించారు. 420 గాళ్లు, మర్డర్ కేసులో ఉన్నవాళ్లు, సీఐగా ఉన్నప్పుడు ఒళ్లు అమ్ముకునేవాళ్ల వద్ద కూడా డబ్బులు కొట్టేసినవాడు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవాళ్లు... వీళ్లు నిజనిర్ధారణ కమిటీలో సభ్యులు! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వీళ్లను ప్రజలు రాజకీయ సమాధి చేసి రెండున్నరేళ్లు అయిందని, వచ్చే ఎన్నికలు కాదు కదా, సమీప భవిష్యత్తులో టీడీపీ గెలిచేది లేదని స్పష్టం చేశారు. 2024 కాదు 2034 వరకు టైమిస్తున్నా... గెలిచి చూపించండి అంటూ సవాల్ విసిరారు.

"ఇప్పుడు డీజీపీపై పడి ఏడుస్తున్నారు... ఆయన విజయవాడ కమిషనర్ గా చేశారు. ఈ బుద్ధా వెంకన్న ఎలాంటివాడో, బోండా ఉమ ఎలాంటివాడో ఆయనకు బాగా తెలుసు. బుద్ధా వెంకన్న ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. పిచ్చివాగుడు వాగితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు" అని హెచ్చరించారు.
Go Back to Shorts
Kodali Nani
TDP Leaders
Chandrababu
Budda Venkanna
YSRCP
Andhra Pradesh

More Telugu News