Bull: జల్లికట్టులో విషాదం... యజమానినే చంపేసిన వృషభం

Bull killed owner at Jallikattu arena in Tamilnadu
  • పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు
  • సురియూర్ గ్రామంలో ఘటన
  • యజమానిపైకి కొమ్ములు విసిరిన ఎద్దు
  • తీవ్ర రక్తస్రావంతో యజమాని మృతి
తమిళనాడులో పొంగల్ వేడుకల సందర్భంగా జల్లికట్టు పోటీలు నిర్వహించడం ప్రాచీన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ సాహసోపేతమైన క్రీడలో బలిష్టమైన వృషభాలను లొంగదీయాల్సి ఉంటుంది. అయితే, తిరుచ్చి సమీపంలోని సురియూర్ గ్రామంలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని సొంత ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి తన ఎద్దును సురియూర్ గ్రామానికి తీసుకువచ్చాడు.

అయితే, ఆ వృషభానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జల్లికట్టు బరి వద్దకు తీసుకెళుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ఎద్దు ఒక్కసారిగా కొమ్ములు విసరడంతో మీనాక్షి సుందరానికి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
Bull
Owner
Death
Jallikattu
Tamilnadu

More Telugu News