చంద్రయ్య హత్యను రాజకీయం చేయొద్దు: గుంటూరు రూరల్ ఎస్పీ విజ్ఞప్తి

no politicize TDP Leader chandraiahs murder said IPS vishal gunni
  • చంద్రయ్య హత్య కేసులో వెల్దుర్తి ఎంపీపీ చింతా శివరామయ్య ప్రధాన నిందితుడు
  • హత్యలో పాల్గొన్న వారిలో శివరామయ్య కుమారులు
  • రోడ్డు వేసే విషయంలో ఇద్దరి మధ్య గొడవ
  • హత్యకు అదే కారణమన్న ఎస్పీ విశాల్ గున్నీ
పల్నాడు టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య (45) హత్యను రాజకీయం చేయొద్దని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ విజ్ఞప్తి చేశారు. చంద్రయ్య హత్య కేసులో నిందితులు 8 మందినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

ఈ కేసులో వెల్దుర్తి ఎంపీపీ చింతా శివరామయ్య ప్రధాన నిందితుడని, చింతా యలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివన్నారాయణ, చింతా ఆదినారాయణ ఉన్నట్టు చెప్పారు.

వీరిలో శ్రీనివాసరావు, ఆదినారాయణ ప్రధాన నిందితుడైన శివరామయ్య కుమారులు. బైక్‌పై వెళ్తున్న చంద్రయ్యను శివరామయ్య, మిగిలినవారు అడ్డుకున్నారని, దీంతో ఆయన కిందపడిపోయాడని ఎస్పీ తెలిపారు. ఆ వెంటనే కిందపడిన చంద్రయ్యపై కత్తులు, రాళ్లతో దాడిచేసి హత్య చేశారని పేర్కొన్నారు.

నిందితులు 8 మందిని 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పథకం ప్రకారమే హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. గ్రామంలో సిమెంటు రోడ్డు వేసే విషయంలో శివరామయ్యకు, చంద్రయ్యకు మధ్య వివాదం చెలరేగిందన్నారు.

ఈ నెల 10న ఓ శుభకార్యానికి హాజరైన చంద్రయ్య.. శివరామయ్యను చంపుతానని బెదిరించాడని, బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శివరామయ్య తన కుమారులు, తన బంధువులు ఐదుగురితో కలిసి చంద్రయ్య హత్యకు కుట్ర పన్నినట్టు ఎస్పీ వివరించారు. చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులు ఎనిమిది మందీ హత్యలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
Go Back to Shorts
Chandraiah
Palnadu
Guntur District
TDP
Vishal Gunni

More Telugu News