పీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం.. పంజాబ్ ప్రభుత్వం మరో యాక్షన్

  • ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ బదిలీ
  • లూధియానా థర్డ్ ఐఆర్బీకి కమాండెంట్ గా నియామకం
  • ఆయన స్థానంలో కొత్త ఎస్ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్
పీఎం పర్యటనలో భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం.. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీని బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన ఫిరోజ్ పూర్ లో బహిరంగ సభ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. ఫిరోజ్ పూర్ కు కొద్ది దూరంలోనే ఫ్లై ఓవర్ ను నిరసనకారులు బ్లాక్ చేశారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ రోడ్డు మీదే ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు పంజాబ్ ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం సాగింది.

ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నాయి. స్వతంత్ర దర్యాప్తు కమిటీపై సోమవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే నిన్న పంజాబ్ ప్రభుత్వం ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ హర్మన్ దీప్ సింగ్ హన్స్ ను బదిలీ చేసింది. హర్మన్ ను లూధియానాలోని థర్డ్ ఐఆర్బీకి కమాండెంట్ గా నియమించింది. ఆయన స్థానంలో ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్ ను నియమించింది.

కాగా, అంతకుముందు రాష్ట్ర డీజీపీనీ ప్రభుత్వం మార్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 9 మంది అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలున్నందున చాలా మంది అధికారుల అదనపు బాధ్యతలనూ తొలగించింది.

Prime Minister
Narendra Modi
Punjab
BJP
Congress
Police

More Telugu News