దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు.. తాజా సమాచారం ఇదిగో!

 National daily Covid cases double at record pace
  • బుధవారం 13,154 కేసుల నమోదు  
  • మహారాష్ట్రలో అత్యధికంగా 3,900 కేసులు
  • ఆ తర్వాత కేరళ, పశ్చిమ బెంగాల్ లో అధిక కేసులు
  • 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155తో పోలిస్తే 40 శాతం పెరిగాయి. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.

వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా చేయడం వల్ల సోమవారం కేసులు తగ్గి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. కనుక వచ్చే కొన్ని రోజుల్లో కేసుల సంఖ్య వాస్తవ పరిస్థితికి అద్దం పట్టనుంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 3,900 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత కేరళలో 2,846 కేసులు, బెంగాల్ లో 1,089 కేసులు, ఢిల్లీలో 923 కేసులు, తమిళనాడులో 739 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కేసులు అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే పెరిగాయి. కర్ణాటకలో 566, గుజరాత్ లో 548, ఝార్ఖండ్ లో 344, హర్యానాలో 217, తెలంగాణలో 235 కేసుల చొప్పున వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 961కి చేరాయి.
Go Back to Shorts
covid cases
corona
omicron
raises

More Telugu News