అమరావతి రైతుల తిరుపతి సభకు రాలేము: సీపీఎం

తిరుపతిలో అమరావతి రైతులు భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఆహ్వానాలు పంపింది. అయితే సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు.

సభకు తమను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెపుతున్నామని లేఖలో ఆయన పేర్కొన్నారు. అయితే అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా ఉన్న బీజేపీతో తాము వేదికను పంచుకోలేమని చెప్పారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

రాజధానిని ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది సీపీఎం వైఖరి అని చెప్పారు.


More Telugu News