లోకేశ్ భాష అసభ్యంగా ఉంది.. చంద్రబాబు చమటలు కక్కుతున్నారు: విజయసాయిరెడ్డి

కుప్పంలో వైసీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టినా కుప్పం ప్రజలు కనికరించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ద్రోహం అనే పదానికి చంద్రబాబు పర్యాయపదం అయ్యారని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు చమటలు కక్కుతున్నారని అన్నారు.

చిత్తుగా ఓడిపోయినప్పుడల్లా చంద్రబాబు ఒక కొత్త థియరీ చెపుతారని వ్యాఖ్యానించారు. ఓటమి ఖాయమని తెలిసిన వెంటనే థియరీల పుస్తకాన్ని దుమ్ము దులిపి బయటకు తీస్తారని అన్నారు. ఓటమిని ఈవీఎంల మీదకు నెడతారని... అధికార దుర్వినియోగం, రౌడీయిజం చేసి గెలిచారంటారని విమర్శించారు. ప్రజలు తరిమి కొట్టారనే నిజాన్ని మాత్రం చచ్చినా ఒప్పుకోరని అన్నారు.

నారా లోకేశ్ మాట్లాడుతున్న భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చేలా ఉందని విజయసాయి దుయ్యబట్టారు. టీడీపీ భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతున్న వ్యక్తి మాట్లాడే భాష ఇలాగేనా ఉండాల్సిందని ప్రశ్నించారు. జీవీఎంసీలో రెండు వార్డుల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు.


More Telugu News