మోహన్ బాబుదీ, నాదీ అన్నదమ్ముల అనుబంధం: మంత్రికి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • తప్పును తప్పుగా చెప్పే గొప్ప వ్యక్తి మోహన్ బాబు
  • సమాజహితం కోసమే మోహన్ బాబు మాట్లాడతారు 
  • ఆయన కోపం వల్ల ఆయనకే ఎక్కువ చెడు జరిగింది   
  • మంచి వ్యక్తులను 'మా' కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు
సీనియర్ సినీ నటుడు మోహన్ బాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. తప్పును తప్పుగా చెప్పే గొప్ప వ్యక్తి మోహన్ బాబు అని కితాబునిచ్చారు. ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం ఆయనదని అన్నారు. తనది, మోహన్ బాబుది అన్నదమ్ముల అనుబంధమని చెప్పారు.

మోహన్ బాబుకు కోపం ఎక్కువేనని... అయితే ఆ కోపం వల్ల ఆయనకే ఎక్కువ చెడు జరిగిందని, పక్క వాళ్లకు కాదని అన్నారు. సమాజహితం కోసమే మోహన్ బాబు మాట్లాడతారని చెప్పారు. 'మా' నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి తలసాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంచి వ్యక్తులను 'మా' కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారని ఈ సందర్భంగా తలసాని అన్నారు. 'మా' అంటే ఒక కుటుంబం మాత్రమే కాదని, ఒక వ్యవస్థ అని చెప్పారు. అందరినీ గౌరవించే వ్యక్తి మంచు విష్ణు అని కితాబునిచ్చారు. 900 మంది సభ్యులకు యువకుడైన విష్ణు నాయకత్వం వహించబోతున్నారని చెప్పారు.

'మా'కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. హైదరాబాద్ సినీ హబ్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తొలుత పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. సింగిల్ విండో ద్వారా సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.


More Telugu News

Talasani TRS Mohan Babu Manchu Vishnu Tollywood MAA