మాట్లాడే అవకాశం నాకెందుకు ఇవ్వడం లేదు?: సొంత పార్టీపై జగ్గారెడ్డి ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అసంతృప్తి గళం వినిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న తనను అవమానిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లదలచుకుంటే ఎవరు అడ్డుకోగలరని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తరఫున 4 పర్యాయాలు గెలిచిన వారికే గౌరవం దక్కని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని తానేనని, కానీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు.

గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందని, గీతారెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గీతారెడ్డి అంటే తనకు గౌరవం ఉందని, కానీ ఆ సభలో ఆమె తన పట్ల వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు.

"ఎవరి ప్రోద్బలంతో గీతారెడ్డి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు? కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది?" అని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణలో తనకు సొంత ఇమేజి ఉందని, పార్టీ తోడ్పాటు లేకుండానే రెండు లక్షల మందితో సభ పెట్టగలనని స్పష్టం చేశారు.


More Telugu News