Hyderabad: నిందితుడు ఎక్కడ?.. సైదాబాద్ హత్యాచార కేసులో వీడని చిక్కుముడి..!

Saidabad Rape Case friend helped accused to escape
  • నిందితుడు చిక్కాడన్న మంత్రి కేటీఆర్
  • గాలిస్తున్నామన్న పోలీసులు
  • నిందితుడు  పారిపోయేందుకు సాయం చేసిన స్నేహితుడు
చాక్లెట్ ఆశ చూపించి హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి తెగబడి, ఆపై హత్య చేసిన కేసులో చిక్కుముడి వీడడం లేదు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పల్లంకొండ రాజును తప్పించేందుకు బస్తీకి చెందిన మరొకరు సహకరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు మరో వ్యక్తితో వెళ్తుండడం కనిపించింది. మరోవైపు, నిందితుడిని పట్టుకున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించగా, పోలీసులు మాత్రం అతడి కోసం ఇంకా గాలిస్తున్నట్టు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

కాగా, చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, పోలీసులు గాలిస్తున్న సమయంలో రాజును అతడి స్నేహితుడు పక్కకు తీసుకెళ్లి అక్కడి నుంచి పారిపోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. పైగా, చుట్టుపక్కలవారు అతడిని గుర్తించకుండా ఉండేందుకు టోపీ, మాస్క్, తువ్వాలు, జత దుస్తులు కూడా ఇచ్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇక నిందితుడి వద్ద ఫోన్ లేకపోవడంతో అతడి ఆచూకీని కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. కాగా, నిందితుడు తమ అదుపులో లేడని పోలీసులు చెబుతున్నప్పటికీ, అతడిని ఇప్పటికే వారు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News

Hyderabad
Saidabad
KTR
Girl Child
Rape Case