Gopal Mandal: కడుపులో గడబిడ... రైల్లో ఈ ఎమ్మెల్యే ఏంచేశాడో చూడండి!

  • తేజాస్ రైల్లో ఎక్కిన బీహార్ జేడీయూ ఎమ్మెల్యే 
  • పాట్నా నుంచి ఢిల్లీకి ప్రయాణం 
  • పలుమార్లు వాష్ రూంకు వెళ్లిన వైనం
  • వంటిపై కేవలం లోదుస్తులు!
  • ఇబ్బందిపడిన ప్రయాణికులు
  • రైల్వే అధికారులకు ఫిర్యాదు
Bihar JDU MLA Gopal Mandal irritates co passengers in trains

ఓ ఎమ్మెల్యే రైల్లో కేవలం లోదుస్తులతో తిరిగిన తీరు ఇతర ప్రయాణికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆయన పేరు గోపాల్ మండల్. బీహార్ లోని అధికార జేడీయూ పార్టీ శాసనసభ్యుడు. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు తేజస్ ఎక్స్ ప్రెస్ రైలులో ఎక్కారు. అయితే, ప్రయాణం సందర్భంగా ఆయనకు కడుపులో గడబిడ మొదలైంది. పలుమార్లు వాష్ రూంకు వెళ్లాల్సి రావడంతో ఆయన వంటిపై బనియన్, లోదుస్తులతోనే తిరిగారు.

కంపార్ట్ మెంట్ లో గోపాల్ మండల్ అవతారం చూసిన ఇతర ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఈ అంశం గొడవకు కూడా దారితీసింది. దుస్తులు ధరించాలంటూ ఇతర ప్రయాణికులు కోరగా, ఆయన నిరాకరించారు. దాంతో కాసేపు వాగ్యుద్ధం నెలకొంది. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో రైల్వే అధికారులు స్పందించి, ఆ ఎమ్మెల్యేని మరో కంపార్ట్ మెంట్ కు పంపించారు. దాంతో గొడవ సద్దుమణిగింది.

దీనిపై ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివరణ ఇచ్చారు. తాను కండువాను కట్టుకునేంత సమయం కూడా లేకపోయిందని, హడావుడిగా వాష్ రూంకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కంపార్ట్ మెంట్ లో మహిళలు ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ అంశం రాజకీయ కలకలం రేపింది. రైల్లో లోదుస్తులతో తిరిగే ఈ ఎమ్మెల్యేనే జేడీయూ బ్రాండ్ అంబాసిడర్ అని ఆర్జేడీ వ్యంగ్యం ప్రదర్శించింది. సీఎం నితీశ్ కుమార్ కు ప్రియమైన ఎమ్మెల్యే ఇతడేనంటూ ఎద్దేవా చేసింది.

More Telugu News