ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: లండన్ హైకోర్టు కీలక తీర్పు

London High Court isues bankruptcy orders over Vijay Mallya
  • మాల్యా దివాలా తీసినట్టు ప్రకటించిన కోర్టు
  • మాల్యా ఆస్తుల స్వాధీనానికి మార్గం సుగమం
  • కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకుల కన్సార్టియం
  • అప్పీల్ అవకాశం కూడా కోల్పోయిన మాల్యా
తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా దివాలా తీసినట్టు అధికారికంగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న మాల్యా ఆస్తులను భారతీయ బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చంటూ మార్గం సుగమం చేసింది. ఈ మేరకు లండన్ హైకోర్టు న్యాయమూర్తి మైకేల్ బ్రిగ్స్ కీలక తీర్పు వెలువరించారు.

ఒకప్పుడు కింగ్ ఫిషర్ బ్రాండ్ తో ప్రపంచ మద్యం సామ్రాజ్యాన్ని శాసించిన మాల్యా ఆపై అదే బ్రాండు పేరిట విమానయాన సంస్థ నెలకొల్పి దారుణంగా దెబ్బతిన్నాడు. అప్పుల మీద అప్పులు చేసి బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ రుణాలను మాల్యా కావాలనే ఎగవేసి విదేశాలకు పారిపోయాడని 13 బ్యాంకులతో కూడిన కన్సార్టియం గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తోంది. లండన్ హైకోర్టు తాజా తీర్పుతో ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు తమ రుణాలు రాబట్టుకునేందుకు వీలు కల్పించినట్టయింది.

ఈ కేసులో మాల్యాకు ఇక చివరి అవకాశం కూడా లేదు. తాజా తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మాల్యా న్యాయమూర్తిని కోరగా, ఆ పిటిషన్ ను జడ్జి మైకేల్ బ్రిగ్స్ తిరస్కరించారు.
Go Back to Shorts
Vijay Mallya
Bankruptcy
London High Court
Banks
India

More Telugu News