తెలంగాణలో నేడు భారీ, రేపు ఓ మాదిరి వర్షాలు!

  • కోస్తాంద్రపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వానలు
  • నిన్న మాగనూర్‌లో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • వికారాబాద్‌లో పిడుగుపాటుకు రైతు మృతి
తెలంగాణలో నేడు, రేపు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్రపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు భారీగా, రేపు ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

నారాయణపేట జిల్లాలోని మాగనూర్‌లో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వికారాబాద్ మండలంలోని కొటాలగూడ శివారులో నిన్న సాయంత్రం పిడుగు పడి అదే గ్రామానికి చెందిన 38 ఏళ్ల దాసు అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.

Telangana
Rains
Maganur
Vikarabad District

More Telugu News