డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకు.. ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

DOST Registration date extended in Telangana
  • నిన్నటితో ముగిసిన ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు
  • పలు కారణాలతో తగ్గిన రిజిస్ట్రేషన్లు
  • 24 వరకు రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించిన ప్రభుత్వం
  • ఈ నెల 31 నుంచి తొలి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్)లో రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ గడువు నిన్నటితో ముగియనుండగా, తాజాగా ఈ నెల 24వ తేదీకి పొడిగించారు. నిన్న మధ్యాహ్నం వరకు 1,40,581 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈసారి ఇంటర్‌లో 4.73 లక్షల మంది ఉత్తీర్ణులు అయినా రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. కరోనా, వర్షాలు, విద్యుత్ అంతరాయాలు తదితర కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని భావిస్తున్న అధికారులు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. 31 నుంచి సీట్లు కేటాయిస్తారు.

అనంతరం ఆగస్టు 1వ తేదీ నుంచి 9 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. విద్యార్థులు 2వ తేదీ నుంచి 9 వరకు వెబ్ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. స్పెషల్ కేటగిరీ (దివ్యాంగులు, ఆర్మీ పిల్లలు, ఎన్‌సీసీ తదితర) విద్యార్థులు ఆగస్టు 6న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేయించుకోవాలని, ఆగస్టు 14 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
DOST
Telangana
Degree Colleges
Admission

More Telugu News