పర్యాటకులు గుంపులుగా తిరుగుతున్నారు... జాగ్రత్త!: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ
- దేశంలో కరోనా ఆంక్షల సడలింపు
- హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకుల తాకిడి
- థర్డ్ వేవ్ పై కేంద్రం ఆందోళన
- కరోనా ముప్పు పెరుగుతుందని వెల్లడి
ఇటీవలి వరకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లే బయటి వారికి ఆర్టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరిగా ఉండేది. అయితే, తాజాగా కొవిడ్ సంబంధిత ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు ఆర్టీ-పీసీఆర్ నిబంధన కూడా తొలగించింది. దాంతో హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సిమ్లా, మనాలి, ధర్మశాల వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లోని హోటళ్లలో రూములన్నీ బుక్ అయిపోయాయి. అయితే, ఒక్కసారిగా టూరిస్టుల తాకిడి పెరగడం కరోనా ముప్పును మరింత పెంచుతుందని కేంద్రం తన లేఖలో హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల విశృంఖలతపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందిస్తూ... సిమ్లా, మనాలి, ముంబయిలోని కొన్ని మార్కెట్లు, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో జనాలను చూస్తుంటే వారు ప్రయాణాల పట్ల మొహం వాచిపోయివున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.