32 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న గిరిజాబాయి మృతి

  • 52 ఏళ్ల క్రితం భర్తతో కలిసి కాన్నాపూర్ అటవీ ప్రాంతానికి
  • భర్త, ఆ తర్వాత కుమారుడు మృతి
  • గోండు భాష మాత్రమే తెలుసు
  • అడవిలో దొరికే కందలు, గడ్డలు తింటూ జీవనం
గోండు భాష మాత్రమే తెలిసి 32 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న ఆదివాసీ వృద్ధురాలు పూసం గిరిజాబాయి నిన్న అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె వయసు 85 సంవత్సరాలు. గిరిజాబాయి 52 ఏళ్ల క్రితం భర్త జైతుతో కలిసి బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం ఖైరదట్వా నుంచి ఉట్నూరు మండలం కాన్నాపూర్ అటవీ ప్రాంతంలో స్థిరపడింది.

ఆ తర్వాత కొంతకాలానికే భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం కుమారుడు రాముతో కలిసి అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. అయితే, 32 ఏళ్ల క్రితం కుమారుడు కూడా కన్నుమూశాడు. గోండు భాష మాత్రమే తెలిసిన ఆమె అడవి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు.  

కొడుకు మరణం తర్వాత కన్నాపూర్ రాజులమడుగు అటవీ ప్రాంతంలోని ఓ చెట్టు కింద స్థిర నివాసం  ఏర్పాటు చేసుకుంది. అడవిలో దొరికే కందలు, గడ్డలు తింటూ ఇంతకాలం జీవించింది. 32 ఏళ్లుగా వన్యప్రాణుల మధ్య గడిపిన ఆమె అనారోగ్య కారణాలతో నిన్న మరణించింది.

Adilabad District
Girijabai
Telangana

More Telugu News