ఇది జగన్ రెడ్డి పాపం... ప్రజలకు శాపం: నారా లోకేశ్

  • ఏపీలో పెట్రోల్ లీటరు ధర రూ.101.61
  • విమర్శలు సంధించిన లోకేశ్
  • రాష్ట్రాన్ని పెట్రోల్ ధరల పెంపులో నెంబర్ వన్ గా నిలిపారని ఎద్దేవా
  • అన్ని రేట్లు పెరిగాయని కామెంట్ 
సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్న జగన్ రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ ట్యాక్స్ లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లు పెరిగాయని వ్యంగ్యంగా అన్నారు.

బాదుడు రెడ్డి ధాటికి పెట్రోల్ ధర శుక్రవారం సెంచరీ దాటి రూ.101.61కి చేరిందని, దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల పెంపులో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపారని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందని, కొవిడ్ కేసుల్లో 5వ స్థానానికి చేర్చారని విమర్శించారు. ఇది జగన్ రెడ్డి పాపం, ఏపీ ప్రజలకు శాపం అని లోకేశ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్... విజయవాడలో పెట్రోల్ ధరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురం నగరాల్లో పెట్రోల్ ధరలతో పోల్చుతూ ఓ పట్టికను ప్రదర్శించారు. అందులో విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయల కంటే ఎక్కువ ఉండగా, ఇతర దక్షిణాది నగరాల్లో వంద రూపాయలకు లోపే ఉంది.

Nara Lokesh
Jagan
Petrol
Hike
Andhra Pradesh

More Telugu News