కేంద్ర మంత్రుల బిజీ షెడ్యూల్... సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని భావించిన సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. కేంద్రమంత్రుల బిజీ షెడ్యూల్ అందుకు కారణమని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వ్యాక్సిన్ల అంశంపై సీఎం జగన్ దేశంలోని ముఖ్యమంత్రులందరినీ కూడగట్టే ప్రయత్నం చేశారు. వ్యాక్సిన్లపై సీఎంలు ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో, వ్యాక్సినేషన్ పై తన బాణీని కేంద్రానికి వినిపించాలని సీఎం జగన్ భావించారని, దాంతోపాటే రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి పనులు, విభజన హామీలపైనా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని కథనాలు వచ్చాయి.


More Telugu News