గుజరాత్ పై విరుచుకుపడనున్న తౌతే తుపాను.. ముంబై ఎయిర్ పోర్టు మూసివేత

  • ఈ రాత్రి గుజరాత్ తీరాన్ని తాకనున్న తౌతే తుపాను
  • లక్షన్నర మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • తీరానికి సురక్షితంగా చేరుకున్న 6,700 మత్స్యకారుల పడవలు
తౌతే తుపాను ఇప్పటికే కేేరళ, కర్ణాటక రాష్ట్రాలను ముంచెత్తింది. భారీ వర్షాలకు ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఈ తుపాను ప్రస్తుతం ముంబైకి వాయవ్య దిశగా 16 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను నేపథ్యంలో ముంబై ఎయిర్ పోర్టు మూతపడింది.

తౌతే తుపాను ఈ రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో పోర్ బందర్, మహువా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ప్రాంతాల్లోని దాదాపు లక్షన్నర మంది ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయని, 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

మరోవైపు అధికారుల హెచ్చరికలతో 2, 200 ఫిషింగ్ బోట్లు గుజరాత్ కు, 4,500 పడవలు మహారాష్ట్రకు సురక్షితంగా చేరుకున్నాయి. సముద్రంలో ఉన్న 300 వాణిజ్య నౌకలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఆయిల్ రిగ్ ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Cyclone Tauktae
Gujarat
Maharashtra
Mumbai Airport

More Telugu News