Komatireddy Venkat Reddy: తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను 'ఫ్రంట్ లైన్ వారియర్స్'గా గుర్తించాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy demands Telangana govt must recognize journalists as corona front line warriors
  • సిద్ధిపేట జిల్లా సాక్షి రిపోర్టర్ కరోనాతో మృతి
  • ఎంతో బాధాకరమైన విషయమన్న కోమటిరెడ్డి
  • జర్నలిస్టు కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • జర్నలిస్టులకు ప్రభుత్వమే వైద్యం చేయించాలని విజ్ఞప్తి
సిద్ధిపేట జిల్లా సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనాతో మృతి చెందడం తనను బాధకు గురిచేసిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు.

కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించాలని స్పష్టం చేశారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Komatireddy Venkat Reddy
Journalists
Front Line Warriors
Corona Virus
Telangana

More Telugu News