Tamil Nadu: లాక్‌డౌన్ ప్రకటించిన తమిళనాడు.. ఈ నెల 10 నుంచి 14 రోజులపాటు అమలు

  • ఆంక్షలకు లొంగని కరోనా
  • రెండు వారాలపాటు కఠిన లాక్‌డౌన్
  • అత్యవసర సేవలకు మినహాయింపు
amil Nadu announced full lockdown

లాక్‌డౌన్ ప్రకటించిన జాబితాలో తాజాగా తమిళనాడు కూడా చేరింది. ఎల్లుండి నుంచి (10వ తేదీ) నుంచి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అత్యవసరం కాని సేవలన్నీ నిలిచిపోనున్నాయి.

లాక్‌డౌన్ కాలంలో కిరాణ దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చినా టేక్ అవేలకు మాత్రమే వాటిని పరిమితం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సచివాలయం, ఆరోగ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీస్, అగ్నిమాపక, జైలు విభాగం, స్థానిక అధికార యంత్రాంగం, ఈబీ, పీడ్ల్యూడీ, సాంఘిక సంక్షేమం, అటవీ విభాగాలు మాత్రం పనిచేస్తాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, జిమ్‌లు, రిక్రియేషన్ క్లబ్‌లు, బార్లు, ఆడిటోరియంలు, మీటింగ్ హాళ్లను మూసివేయాలని పేర్కొంది.

More Telugu News