West Bengal: బెంగాల్‌లో వామపక్షాల పరిస్థితిపై మమత సానుభూతి!

Mamata banerjee sympathises with left situation in bengal
  • అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ హవా
  • సొంతంగా ఒక్క సీటూ గెలుచుకోలేకపోయిన లెఫ్ట్‌
  • కాంగ్రెస్‌దీ వామపక్షాల పరిస్థితే
  • లెఫ్ట్‌ లేకుండా పోవాలని ఎప్పుడూ కోరుకోలేదన్న దీదీ
  • రాజకీయంగా మాత్రమే వ్యతిరేకించానని వెల్లడి
  • బీజేపీ కంటే వామపక్షాలు కొన్ని స్థానాల్లో గెలిచి ఉంటే బాగుండేదన్న దీదీ
ఎర్రజెండాకు పశ్చిమ బెంగాల్‌ ఒకప్పుడు కంచుకోట. కానీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. ఇప్పుడు ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. సుదీర్ఘకాలం తిరుగులేకుండా పాలించిన వామపక్షాలను గద్దెదించి పాగా వేసింది ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌. అయితే, ఇప్పుడు లెఫ్ట్‌ పార్టీల దీనస్థితిని చూసి అనూహ్యంగా దీదీ సానూభూతి వ్యక్తం చేయడం గమనార్హం. తాను వామపక్షాలను రాజకీయంగా వ్యతిరేకించానే తప్ప.. వారు ఉనికే లేకుండా పోవాలని మాత్రం ఎప్పుడూ కోరుకోలేదన్నారు.

బీజేపీకి బదులు బెంగాల్‌లో కొన్ని సీట్లలో వామపక్షాలు విజయం సాధించినా బాగుండేదని మమత వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాల్లో బీజేపీ కంటే లెఫ్ట్‌ ఉండాలనే తాను కోరుకుంటానన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలన్న అత్యుత్సాహంతో ఏకంగా వారిని వారే అమ్మేసుకున్నారని లెఫ్ట్‌ పార్టీలను ఉద్దేశించి అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ అసెంబ్లీకి స్వతహాగా ఎమ్మెల్యేలను పంపలేకపోవడం ఇదే తొలిసారి. బెంగాల్‌లో 292 స్థానాలకు ఎన్నికలు జరగగా  213 సీట్లలో తృణమూల్‌, బీజేపీ 77, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ 1, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందాయి.
West Bengal
Mamata Banerjee
BJP
TMC

More Telugu News