అయోధ్య రామమందిర విరాళాల్లో 15 వేల చెక్కులు బౌన్స్
- వాటి విలువ రూ.22 కోట్లు
- రామజన్మభూమి ట్రస్ట్ ఆడిట్ లో వెల్లడి
- సాంకేతిక సమస్యలు కారణమన్న ట్రస్ట్ సభ్యుడు
- భక్తులు మళ్లీ విరాళాలివ్వాలని విజ్ఞప్తి
బ్యాంకులలో నిధులు లేకపోవడం వల్లగానీ, లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లగానీ చెక్కులు బౌన్స్ అయి ఉండొచ్చని ఆడిట్ నివేదికలో ట్రస్ట్ పేర్కొంది. ఆయా బ్యాంకులు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నాయని, ప్రజలు వీలైతే మళ్లీ విరాళాలు సమర్పించాలని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా కోరారు. కాగా, బౌన్స్ అయిన చెక్కుల్లో 2 వేలకు పైగా చెక్కులు అయోధ్య నుంచి సేకరించినవే కావడం గమనార్హం.
జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు విరాళాలను వసూలు చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు రూ.5 వేల కోట్ల విరాళాలు వచ్చాయి. విరాళాలపై ట్రస్ట్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.