కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే రాజధానిగా తిరుపతి ప్రకటన: చింతా మోహన్

  • వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల్లో ఆందోళన
  • అధికారమిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
  • కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు సంబరపడుతున్నారు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించేలా అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ హామీ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇప్పుడు దళితులు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం భెల్ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులను తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు.    

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, విభజన గాయాన్ని చూపించి కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ సంబరపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి త్వరలోనే సమాధానం లభిస్తుందని, మోదీ త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి ఎక్కువైందని, కాంగ్రెస్‌తోనే మళ్లీ మంచిరోజులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.

Chinta Mohan
Tirupati LS Bypolls
Congress
Andhra Pradesh

More Telugu News