అప్పులు చేసి ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్: కొడాలి నాని

Jagan is a leader who protected the people by making debts says Kodali Nani
  • రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే
  • లోకేశ్ ని ఓడించారని ప్రజలను తిడుతున్నారు
  • తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అతిపెద్ద అవినీతి చక్రవర్తి అని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబేనని విమర్శించారు. 3 లక్షల 60 వేల కోట్లను చంద్రబాబు అప్పు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని అల్జీమర్స్ వల్ల మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించారనే కారణంతో ప్రజలను చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. చంద్రబాబును ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కూడా కాపాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, వైయస్సార్ సుపరిపాలనకు జగన్ వారసుడని అన్నారు.

కరోనా వల్ల ప్రజలకు తినడానికి తిండి లేకపోతే... అప్పులు చేసి ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్ అని కొడాలి నాని ప్రశంసించారు. అప్పులను ఇప్పుడు కాకపోతే పదేళ్ల తర్వాత తీర్చుకోవచ్చని... ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేకపోయిందనే సొల్లు చెపితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. వెంకన్న దయతో వైసీపీ 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News