కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా.. టైటిల్ 'అన్నం'!

  • కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' 
  • ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు
  • వయొలెన్స్ నేపథ్యంలో సాగే 'అన్నం'
మనకున్న ప్రతిభావంతమైన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గతంలో ఆయన చేసిన సినిమాలలో కొన్ని సంచలన విజయాలను సాధించినవి కూడా వున్నాయి. అయితే, కొత్త దర్శకుల హవాలో ఆయన కాస్త వెనకపడినప్పటికీ, ఇంకా తన ముద్ర కోసం ప్రయత్నిస్తూనే వున్నారు. ప్రస్తుతం ఆయన 'రంగమార్తాండ' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది.

ఇదిలావుంచితే, తాజాగా కృష్ణవంశీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రం పేరు 'అన్నం'. పరబ్రహ్మ స్వరూపం అన్నది దీనికి ట్యాగ్ లైన్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.

ఇక టైటిల్ లోగో గురించి చెప్పాలంటే... అరిటాకులో రక్తపుమరకలతో నిండిన కొడవలి.. తెగిపడిన తాళిబొట్టు.. ఆకునిండా వెదజల్లిన రక్తం.. మధ్యలో అన్నం అనే పేరుతో ఈ లోగోను డిజైన్ చేశారు. వయొలెన్స్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందన్న విషయాన్ని ఈ లోగోతో చెప్పకనే చెప్పారు. అయితే, ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ప్రకటించలేదు.

Krishna Vamshi
Ramaya Krishna
Prakash Raj

More Telugu News