Sake Sailajanath: ఉక్కు కర్మాగారం అంశంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రజలను బాధిస్తున్నాయి: శైలజానాథ్

Sailajanath says YCP leaders hurts people sentiments over Vizag Steel Plant issue
  • ఏపీలో రగులుతున్న స్టీల్ ప్లాంట్ వ్యవహారం
  • వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన ఏపీ పీసీసీ చీఫ్
  • ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యలు
  • సీఎం జగన్ అడ్డుకోవాలని హితవు
  • ఎంపీలు ఉండి కూడా ఉపయోగం లేకపోయిందని విమర్శలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశాన్ని విపక్షాల విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ వైసీపీ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ప్రజలను బాధిస్తున్నాయని వెల్లడించారు. ఏమీ తెలియని వాళ్లలా అమాయకత్వం నటిస్తే ప్రజలు నమ్మేస్తారని భావించడం పొరబాటని అన్నారు.

ఏడాది కిందటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రంగం సిద్ధమైందని శైలజానాథ్ తెలిపారు. ప్రైవేటీకరణ అంశం వెనుక కుట్ర ఉందని, దీన్ని ఆపాల్సిన బాధ్యత సీఎం జగన్ దేనని స్పష్టం చేశారు. ఎంపీలు ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని అసమర్థులని ఏపీ పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.

ఇటీవల సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' నిర్వహిస్తే మీరు 'ఉత్తరాలు కీ బాత్' చేస్తుంటారని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని శైలజానాథ్ వెల్లడించారు.
Sake Sailajanath
AP PCC
Vizag Steel Plant
YSRCP
Jagan
Congress
Andhra Pradesh

More Telugu News