శంకర్ సర్ వంటి సినీ మేధావి దర్శకత్వంలో నటించనుండడం ఎంతో ఉద్విగ్నంగా ఉంది: రామ్ చరణ్

  • రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • దిల్ రాజు బ్యానర్ లో 50వ చిత్రం
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ చరణ్ వెల్లడి
  • త్వరలోనే తారాగణం వివరాలతో ప్రకటన
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, సౌతిండియా సూపర్ డైరెక్టర్ శంకర్ ల కలయికలో భారీ చిత్రం ప్రకటించడం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రానికి నిర్మాతలు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చే 50వ చిత్రం కావడం, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడం ఈ సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టాయి. దీనిపై హీరో రామ్ చరణ్ స్పందించారు. శంకర్ సర్ వంటి సినీ మేధావి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో తాను కూడా భాగం కావడం ఎంతో ఉద్విగ్నతకు గురిచేస్తోందని వెల్లడించాడు.

తన కెరీర్ లో ఇది 15వ చిత్రమని, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు 50వ చిత్రమని చరణ్ పేర్కొన్నాడు. దిల్ రాజు, శిరీష్ ల నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ చిత్రంపై దిల్ రాజు బ్యానర్ వర్గాలు కూడా స్పందించాయి. తమ సంస్థలో మైలురాయి వంటి చిత్రం అవుతుందని తెలిపాయి. తమ 50వ చిత్రంతో మునుపెన్నడూ చూడనంతటి రెండు అతిపెద్ద శక్తులు ఏకమవుతున్నాయని పేర్కొన్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భారత చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుడు శంకర్ లతో భాగస్వామ్యం కావడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని, ఈ ప్రాజెక్టును ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ట్విట్టర్ లో వెల్లడించింది.


More Telugu News

Ramcharan Shankar Dil Raju SVC Tollywood