Kodali Nani: టీడీపీ నేతలే డ్రామాలు ఆడుతున్నారు.... చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన మంత్రి కొడాలి నాని

Kodali Nani counters Chandrababu comments over Pattabhiram issue
  • విజయవాడలో పట్టాభిరామ్ పై దాడి
  • వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు
  • చంద్రబాబునాయుడిది అబద్ధాల బతుకన్న కొడాలి నాని
  • గతంలో ఎన్టీఆర్ పై దాడికి పన్నాగం పన్నారని వెల్లడి
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి నేపథ్యంలో వైసీపీ నేతలపై చంద్రబాబు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.  ఘాటైన పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు బతుకే అబద్ధాల బతుకు అని విమర్శించారు. శవరాజకీయాలకు చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు.

నాడు ఎన్టీఆర్ పై మల్లెల పద్మనాభంతో దాడి చేయించి దాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా వ్యూహం పన్నిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. తన పిల్లలను తానే ఆరగించే పాము లాంటి వాడు చంద్రబాబు అని, టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నవాళ్లు ఈ విషయం గుర్తెరగాలని కొడాలి నాని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ప్రజల్ని నమ్మించేందుకు చంద్రబాబే ఇలాంటి దాడులు చేయిస్తుంటాడని అన్నారు. దాడి చేసిన వెంటనే గంటలోనే బాధితుల వద్ద కూర్చుని మొసలి కన్నీరు కార్చుతుంటాడని విమర్శించారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన ఎత్తుగడ అని, చంద్రబాబు, పట్టాభి కలిసి ఆడిన డ్రామా అని ఆరోపించారు.
Kodali Nani
Chandrababu
Pattabhiram
YSRCP
Telugudesam

More Telugu News